. . . కొనసాగునున్న గేట్ల మరమ్మత్తు పనులు
. . . దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలంలోని సవర్ గాం గ్రామం వద్దగల కౌలాస్ నాల ప్రాజెక్టు సంబంధించిన తొమ్మిది గేట్ల వైర్ రూప్స్ (గెట్ త్రాడు) మరమ్మత్తు పనులు నిర్వహించే దృష్ట్యా రేపటి నుండి అనగా గురువారం నుండి ప్రాజెక్టులోని నీటిని ప్రధానకాలువ ద్వారా విడుదల చేయటం జరుగుతుందని ప్రాజెక్టు ఏఈ అశ్విని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటం జరుగుతుందని, అనంతరం మూడు రోజుల పాటు 150 క్యూసెక్కుల పెంచటం జరుగుతుందని, నీటిని కాపాడుకుంటూ మరమ్మతులకు అనుగుణంగా నీటి విడుదల పెంచటం జరుగుతుందని, ప్రస్తుతం ప్రాజెక్టులో 454.55 క్యూసెక్కుల నీరు నిల్వవుందని ఆమె తెలిపారు. క్రమం తప్పకుండా నీటి విడుదల దృష్ట్యా వరదా కాలువ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులకు వరదాకాలువలకు దూరంగా ఉంచాలని, మత్స్యకారులు కాలువలో దిగవద్దని, వేసవి కాలం దృష్ట్యా ప్రజలు స్నానానికి గాని, ఈత గాని వెళ్ళవద్దని, ప్రజలు వాగు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ప్రాజెక్టు మరమ్మతుకు తమవంతు సహకారం అందించాలని ప్రాజెక్టు ఏఈ అశ్విని కోరారు.
