. . . సామాన్యులకు శాపంగా చికెన్ ధరలు
ఇందల్ వాయి, బతుకమ్మ :
ఇందల్ వాయి మండల కేంద్రంలో చికెన్ వ్యాపారులు సిండికేట్ గా మారి సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు చికెన్ ధరలను పెంచి విక్రయిస్తున్నారని మండలానికి చెందిన సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు గాని, సంబంధిత అధికారులు గానీ ధరల నియంత్రణ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో గల చికెన్ దుకాణాలలో కిలో చికెన్ 340 రూపాయలకు విక్రయించడం గమనార్హం. అదే డిచ్ పల్లి మండల వ్యాపారులు నిర్ణిత ధరలలో విక్రయిస్తున్నారు. ఇందల్ వాయిలో మాత్రం చికెన్ ధరలు కొండెక్కుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. చికెన్ వ్యాపారుల సిండికేట్ అవడంతో వారికి నచ్చిన ధరలను నిర్ణయిస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధిక ధరలతో ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తున్న చికెన్ వ్యాపారుల సిండికేట్ కు బహిర్గతం చేసి ప్రజల నుండి అధిక డబ్బులు వసూలు చేయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే అధిక ధరలకు మాంసం విక్రయాలు కొనసాగిస్తే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ ఆచరణలో లేకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అధిక ధరలకు మాంసం విక్రయాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలానికి చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
