రుద్రూర్, బతుకమ్మ : నీటి ఎద్దడి తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామస్తులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రధాన రోడ్డుపై ముళ్ళ కంపలు, ద్విచక్ర వాహనాలు పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని గత వారం రోజులుగా విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రెటరీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మండల అధికారులు వచ్చి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు, ప్రత్యేక అధికారి సంతోష్ వచ్చి తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని సముదాయించడంతో గ్రామస్తులు శాంతించి వెనుదిరిగారు.

