నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 596 మార్కుల సాధించిన స్టేట్ టాపర్ గా నిలిచిన కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థిని ఎస్.కృతి ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ సన్మానించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా విద్యార్థిని రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించి పాఠశాల, తల్లిదండ్రులకు, జిల్లాకు,కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించి ఇందూర్ జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఆశీర్వదించారు . పది పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించి, పేయిల్ అయినా విద్యార్థులలొ మనోస్థైర్యం నింపాలని వారిని మానసిక ఆందోళనకు గురికాకుండా విజయం దిశగా అడుగులు వేసేలా ఉపాధ్యాయులు, తల్లి, తండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ధన్ పాల్ లక్ష్మి భాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య అందిస్తున్న వారికి ఈ సంవత్సరం పదో తరగతి మొదటి శ్రేణిలో పాసైన విద్యార్థులు ఉండటం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల చదువుల కు ఎల్లప్పుడు అండగా ఉంటానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు, కాకతీయ విద్యాసంస్థలు ప్రిన్సిపల్ రణదీష్ ,డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ తదితరులు పాల్గొన్నారు.

