బీబీపేట, బతుకమ్మ :
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను బీబీపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్లో మంగళవారం ఆవిష్కరించారు. వాసవి క్లబ్ బీబీపేట, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారి సహకారంతో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బీబీపేట ఎస్ఐ నవీన్ చంద్ర, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం అవుతుందని తెలిపారు. జీవితాంతం రక్తంపై ఆధారపడే ఈ చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మెగా రక్తదాన శిబిరానికి సహకరిస్తున్న వాసవి క్లబ్ బీబీపేట, మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తలసేమియా చిన్నారుల జీవితాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు ఎండీ జమీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్, అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెడిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి జోర్రిగల శ్రీనివాస్, వైశ్య సంఘం కార్యదర్శి ఇల్లందుల ఆంజనేయులు, కోశాధికారి తొడుపునూరి శ్రీనివాస్, బచ్చు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
