హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న వీరు ముగ్గురు సిట్ అధికారులకు సాక్ష్యాలు అందజేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కారణంగా కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఓటమిపాలయ్యిందన్నారు. ఎన్నికల ముందు కావాలనే తమ ఫోన్లు ట్యాప్ చేశారని, మేము ఎక్కడికి వెళ్లినా మా కార్లను ఆపివేసేవారని, తనిఖీలు చేసేవారని పేర్కొన్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నామనే సమాచారం తెలుసుకుని ముందుగానే తమను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, అప్పటి చీఫ్ సెక్రెటరీ, ప్రభాకర్ రావుతో కలిసి 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

