- అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2024-25 విద్య సంవత్సరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో సంబంధిత వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, మే నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం18,837 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్ రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారికి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ కు సూచించారు. పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయినుంచిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు. పరీక్షలు పూర్తైన తర్వాత జవాబు పాత్రల బండల్లను పోస్టల్ శాఖ వారు తమ ఆధీనంలో కి తీసుకుని ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా నిర్ణీత ప్రాంతాలకు జాగ్రత్తగా చేర్చాలని పోస్టల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా అందరు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నమని అన్నారు. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో సీ. సీ. కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. వేసవి దృశ్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా మంచినీటి వసతి తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే వైద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రథమ చికిత్స నిర్వహణ కోసం ఏర్పాట్లు, కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ట్రాన్స్ కో, పోస్టల్, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు, అడిషనల్ పోలీసు కమిషనర్ బస్వారెడ్డి, ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి పాల్గొన్నారు.

