సిద్దిపేట, బతుకమ్మ : సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేట, చింతమడకను కేజీఎఫ్ లా చేశారని, ప్రైవేట్ ప్రాపర్టీగా చేసి రానివ్వలేదని విమర్శించారు. ఏ ఊరూ ఏ అయ్యా జాగీరు కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబం నుంచి విడగొట్టే కుట్రలు చేసిన వాళ్లను విడిచిపెట్టను అని పేర్కొన్నారు. నా కుటుంబంపై కుట్రలు చేసిన వారి భరతం పడతానని పేర్కొన్నారు. చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేది చూపిస్తానని తెలిపారు. చింతమడక చిరుత పులులను కన్న గడ్డ అని, ఇది నా జన్మభూమి అని, భవిష్యత్తులో కర్మభూమి కూడా కావొచ్చు పేర్కొన్నారు. చింతమడక ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు.