ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం, గ్రామ పంచాయతీ తరఫున ఆర్థిక సహాయం అందించారు. గ్రామానికి చెందిన బోడ మీది మల్కాయి కుటుంబం వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ప్రభుత్వం తరఫున రూ.3,200 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా తోర్తి గ్రామ పంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ కౌడ భూమేష్ బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కౌడ భూమేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి గ్రామ పంచాయతీతో పాటు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బొల్లపల్లి సుమన్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాహుల్, జి.పి.ఓ కే. భూమన్న, ఏర్గట్ల మండల ఆర్.ఐ రవి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు సుధీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
