- జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
నిజాంసాగర్, బతుకమ్మ : మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నిజాంసాగర్ మండలంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట్ పరిధిలో గల నర్సింగరావు పల్లి ఎరువుల గోదామును వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో యూరియా స్టాక్ ను పరిశీలించారు. 71 యూరియా బస్తాలు గోడౌన్లో నిల్వ ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా ఇచ్చేటట్టు చూడాలని, మన జిల్లాకు ప్రభుత్వం సరఫరా చేసిన చేసిన యూరియా మన జిల్లా రైతులకు మాత్రమే అందేటట్టు చూడాలని దానిలో భాగంగా జిల్లా చెక్పోస్టులలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ను రైతులు ఉపయోగించేలా రైతులను చైతన్యవంతం చేయాలని అన్నారు. నానో యూరియా రేటు తక్కువ ఉండటంతో పాటు 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని నానో యూరియా రవాణాకు అదనంగా రవాణా ఖర్చులు కూడా ఉండవు, డ్రోన్ ద్వారా సులభంగా పిచికారి చేయవచ్చు కాబట్టి యూరియా బస్తాలకు బదులు నానో యూరియా ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం వారు వారి యొక్క సొసైటీల ముందు ఎక్కువ జనం ఉండకుండా ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటన చేస్తూ యూరియా మేనేజ్మెంట్ చేయాలని సూచించారు. రైతు యొక్క పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా సబ్సిడీ యూరియా పక్కదోవ పట్టకుండా అనగా ఇండస్ట్రీస్ కు, గాని ప్లైవుడ్ ఇండస్ట్రీస్ గాని పెయింట్ ఇండస్ట్రీస్ గాని వెళ్లకుండా అధికారులు పరిశ్రమలను సర్ప్రైజ్ విజిట్స్ చేయమని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి , జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్, సహకార సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులు ఉన్నారు.
