- జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
బాన్సువాడ, బతుకమ్మ : లో లెవెల్ కాజ్ వేలు, బ్రిడ్జిల వద్ద నిఘా ఉంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నిజాంసాగర్ మండల కేంద్రం నుండి అచ్చంపేట వెళ్లే దారిలో గల లో లెవెల్ కాజ్వేను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తో కలిసి పరిశీలించారు. వర్షం నీరు బ్రిడ్జి పై నుండి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో స్థానిక అధికారులు ఏర్పాటుచేసిన భారీకేడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యగా బారికెడ్లను ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను ఆపివేసి ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులను అభినందించి మాట్లాడుతూ వర్షాలు తగ్గి వరద ఉదిరితే తగ్గే వరకు ఇదేవిధంగా అప్రమత్తంగా ఉండి 24 గంటలు నిఘా ఉంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని బ్రిడ్జి దాటనివ్వరాదని సూచించారు. ఇదేవిధంగా మండలంలో ఎక్కడైనా ఇలా బ్రిడ్జిపై నుంచి వాటర్ వెళితే వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, మండల ప్రత్యేక అధికారి ప్రమీల, ఎస్సై శివకుమార్ తదితరులు ఉన్నారు. గోల్ బంగ్లా ప్రాంతంలో పర్యటించి టూరిజం కార్పొరేషన్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాటు చేయనున్న ఎకో టూరిజం ప్రాజెక్టుకు కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర మంత్రులతో ఈ ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోగల భూమిని చదును చేయాలని టూరిజం కార్పొరేషన్ డిఈ విద్యాసాగర్ ను మూడు ఉన్నాయి ఆదేశించారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన నిండిన నిజాం సాగర్ ప్రాజెక్టును బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మరియు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్టులోకి 83 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా 85 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి 15 వరద గేట్ల ద్వారా వదులుతున్న నీటిని పరిశీలించారు. అలాగే 36 సంవత్సరాల తర్వాత ట్రయల్ రన్ గా నీరు వదిలిన 20 గేట్లను పరిశీలించి ఆయా గేట్లకు అవసరమైతే మరమ్మత్తులు చేయించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉన్నది కాబట్టి సందర్శకులు అధిక సంఖ్యలో వచ్చి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున పోలీస్, రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని, వరద నీటి నిర్వహణకు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నరసింగరావు పల్లె గ్రామ సమీపంలో ఐకెపి మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్మించేందుకు స్థలాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై తో కలిసి పరిశీలించి స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని తాసిల్దార్ బిక్షపతిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు.

