. . . బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త ఆందోళనలు
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడుల ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మంగళవారం ఇందూరు జిల్లా పోలీస్ కమీషనర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా జిల్లాలోని బాన్సువాడ, మోపాల్ మండల పరిధిలోని కాల్పోల్ గ్రామం, రుద్రూర్, ఆనంద్ నగర్, అలాగే ఇందూరు నగరంలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజల పైన జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు బాధ్యులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనలు జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మారుతున్నాయని, ఇలాంటి వాటిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని, పోలీసులు పక్షపాత రహితంగా వ్యవహరించి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. జిల్లాలో హిందూ సమాజం భయభ్రాంతులకు గురవుతోందని, తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు స్వయంగా రోడ్డెక్కే పరిస్థితి తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతి సంఘటనపై స్పెషల్ టీమ్ (ప్రత్యేక బృందం) ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సున్నిత ప్రాంతాల్లో పర్మినెంట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, పోలీసు పహారా పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసి, వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెంటనే స్పందించి నిందితులకు తగిన బుద్ధి చెప్పాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేపడతామని గట్టిగా హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం, ధర్మ రక్షణ కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది… న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, గోపిడి వినోద్ రెడ్డి, కృష్ణ, మారెడ్డి వనిత సురేష్, అమందు విజయ్ కృష్ణ, వినోద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

