నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు చేస్తున్న ఒకరిని నగరంలోని వర్ని చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 29న నిజామాబాద్ కు చెందిన దర్శనం ప్రసాద్ తన ద్వి చక్ర వాహనం దొంగతనానికి గురైందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని వర్ని చౌరస్తా ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బోధన్ పట్టణానికి చెందిన కన్యబోయి గంగాధర్ అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాను ద్వి చక్రవాహనాలు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రెండు ద్వి చక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
