. . . శివారు ప్రాంతాల ఇళ్లే టార్గెట్
. . . పూజలకు వెళ్లిన భక్తుల ఇళ్ళలో దొంగతనాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఉదయం వేళ దైవదర్శనానికి వెళ్లిన భక్తుల ఇళ్ళను దొంగలు దోచివేశారు. నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు నిత్యంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున మొదలుకుని మధ్యాహ్నం వరకు మూడిళ్ళలో చోరిలు జరిగాయి. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకశీలనగర్ లో కిరాణా వ్యాపారి రవీంధర్ దుకాణానికి వెళ్లగా కుటుంబ సభ్యులు దైవదర్శనానికి వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి పడకగదిలోని రూ.60 వేలు చోరికి పాల్పడ్డాడు. గంగాస్థాన్ శివారులోని కేశాపూర్ రోడ్డులో రియాల్టర్ బలరాంరెడ్డి ఇంట్లో మధ్యాహ్నం చోరి జరిగింది. బీరువా ధ్వంసం చేసి 25 తులాల బంగారు నగలను చోరి చేశారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో రవీంధర్ కుటుంబ సమేతంగా గుడికి వెళ్లగా దొంగలు తాళాలు ధ్వంసం చేసి రెండు తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. గంటల వ్యవధిలో మూడు ప్రాంతాల్లో చోరిలు జరుగడం పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. పట్టపగలు దొంగలు ఇళ్ళను గుల్ల చేస్తున్నారు.

