నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని శివాజీ నగర్ లో గల ప్రభుత్వ ఐటీఐ లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ( ఏటీసీ) లో చోరీ జరిగింది.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం ఉదయం రెండో టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఐటీసీలను పర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వాటిలో నిజామాబాద్ నగరంలోని ఐటీఐ ప్రాంగణంలో ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీసీలోని కంప్యూటర్లతో పాటు ఇతర విలువైన సామగ్రిని చోరీ చేశారు. వేసిన తాళం వేసినట్టే ఉండగా లోపల ఉన్న సామగ్రి మాత్రం అపహరణకు గురైంది. ఈ విషయంపై ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ యాదగిరిని వివరణ కోరగా…. ఐటీసి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పూర్తిగా నిర్మాణం చేసి అప్పగించలేదని తెలిపారు. ఇప్పటికీ టాటా కంపెనీ వారి ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయని దాని పర్యవేక్షణ వారే చూస్తున్నారని తెలిపారు. టాటా కంపెనీ ప్రతినిధులు సైతం గత కొన్ని రోజులుగా రాత్రి,పగలు పనులు జరుగుతున్నాయని సామగ్రి చోరీకి గురైన విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఐటీసీలో అపహరణకు గురైన సామగ్రి విలువ రూ. లక్షల్లో ఉంటుందని తెలిసింది.
