నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న కవితకు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లూరి అనిల్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలంలో పాటు రూ. 25 వేల పెన్షన్ హామీని అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన కల్వకుంట్ల కవిత కచ్చితంగా ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి అండగా ఉంటానని ప్రకటించారు. ప్రభుత్వం వారికిచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి జిల్లాలో ఉద్యమకారుల లిస్ట్ సిద్ధం చేసి వారికి పెన్షన్ వచ్చేలా కృషి చేస్తానన్నారు. తమ పోరాటానికి కవిత అండగా ఉంటానని ప్రకటించటం పట్ల మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లూరి అనిల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కవిత జనం బాట కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
