యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల యాదవ్
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో నడి ఊరిలో నెలకొల్పిన ప్రైవేటు రైస్ మిల్ పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు, బిఆర్ ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ మంజుల యాదవ్ డిమాండ్ చేశారు. ధర్మోరా గ్రామంలో రైస్ మిల్ వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆమె జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిపిఓ కార్యాలయం నుండి ఎలాంటి అనుమతి లేకుండా రైస్ మిల్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇదివరకు డిపిఓ విచారణలో వెల్లడైందని అయినప్పటికీ ఆ రైస్ మిల్ యజమాని అధికారుల మాటలు కూడా వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికే ఆ రైస్ మిల్ నుండి విడుదలతున్న విషపూరిత రసాయనాల వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, మరొకరు కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే ఆ రైస్ మిల్లును సీజ్ చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
