- జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
- ధర్పల్లి సీ.హెచ్.సీ, తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీ.హెచ్.సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసo స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీ.హెచ్.సీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. ఈ శిబిరంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి, ప్రత్యేక వైద్యులు పాల్గొనే ఈ శిబిరాలకు తరలించాలని అన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. 2002 ఓటరు జాబితాతో కొత్త ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ టి.శాంతకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అన్నారు. నిర్దిష్ట గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
