బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జాగృతి కార్యాలయంలో ’లీడర్‘ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, బతుకమ్మ : ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు నేర్పించాలని బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” కార్యక్రమం పేరిట నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో కవిత ’లీడర్‘ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. జూలైలో హైదరాబాద్ లో ప్రారంభించి ఆగస్టు నుంచి జిల్లాల్లో ప్రతి నెల నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందన్నారు. ప్రజాసమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల చట్టం ప్రకారం రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మహిళ అభ్యర్థులు కావాల్సిన అవసరముందన్నారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ 153కు, లోక్ సభ సీట్లు కూడా పెరుగుతాయన్నారు. మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు.