హైదరాబాద్,బతుకమ్మ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో ఆమెతో పాటుయూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని, హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించలేదన్నారు. దీంతో బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదని గుర్తు చేశారు. సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈనిరసన కార్యక్రమంలో కవిత కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు.


ధర్నాలో పాల్గొన్న కవిత కుమారుడు (సర్కిల్ లో ఉన్న వ్యక్తి)

