- డెయిరీ ఫామ్ లో అక్రమంగా ఇసుక డంపులు
రుద్రూర్, బతుకమ్మ : ఇసుక మాఫియా రోజు రోజుకు పెట్రేగి పోతుంది. ఇసుకాసురులు తమకేమిలే అన్నచందంగా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. పోతంగల్ మండలం మంజీరా నది నుంచి ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఠాగా ఏర్పడిన కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలోని ఓ డైరీ ఫామ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 10 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులు చేశారు. ఈ విధంగా ఇసుకను అక్రమంగా డంపులు చేసి రాత్రివేళల్లో జెసిబి సాయంతో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ అక్రమ దందాను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా ఇసుకను తరలించుకుపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

