- రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మహానీయుల స్ఫూర్తి భావితరాలకు ఎంతో అవసరమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టడం ఎంతో సంతోషం ఉందని, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కృషిని కొనియాడారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల భావితరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. అర్గుల్ గ్రామంలో ఎంతోమంది మేధావులు ఉన్నారని, ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో ముందుందని అన్నారు. రజక సంఘ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, విగ్రహం ఏర్పాటుకు కృషిచేసిన రజక సంఘం వారికి అభినందనలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం ఇస్తుందని, కేంద్రం మాత్రం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని అన్నారు. బీసీల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగిందని గుర్తు చేశారు, అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు బిల్లు ఆమోదించామని, గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపితే కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టి, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బిజెపి పార్టీ వారిని ప్రజలు నమ్మకూడదని, బిజెపి వాళ్లు ఎలక్షన్ల ముందు రాముడు పేరు చెప్పి ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ , సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్క మహిళ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందో తెలుసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను రాజు చేశారని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రైతుల కోసం రైతు భరోసా, బోనస్, పంట రుణమాఫీ వంటి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ వేయడం జరిగిందని, నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే అర్గుల్ గ్రామంలో ఎస్సీ వాడకు 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు కోసం శంకుస్థాపన చేశారు. ప్రాథమిక సహకార సంఘం గోదాం నిర్మాణం కోసం 20 లక్షల నిధులు తో శంకుస్థాపన చేశామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య సెంటర్ భవనం నిర్మాణం కొరకు 20 లక్షల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇప్పటివరకు అర్గుల్ గ్రామానికి 1,06,75,000 నిధులను కేటాయించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ ముని మనుమరాలు శ్వేత ఐలమ్మ, సభ అధ్యక్షులు నిమ్మ గిరి విద్యా సాగర్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఐ సి బి ఎం ఎస్ చైర్మన్ సాయ రెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గుపన్ పల్లి శంకర్, గ్రామ కమిటీ సభ్యుడు రజక సుదర్శన్, రజక సంఘ సభ్యులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

