. . . ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడగలిగే సమ సమాజాన్ని నిర్మించడం, తద్వారా భారతదేశాన్ని మళ్లీ విశ్వగురు పీఠం మీద కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా స్వయం సేవకులు తమ జీవితాన్ని సమర్పణ చేయాలని ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావ్ సూచించారు. బుధవారం ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో మాధవ నగర్ లోని వెక్టార్ పాఠశాలలో వారం రోజులుగా నిర్వహించిన ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థమైన మనసు, నిజాయితీ గల జీవితంతోనే ఆర్ఎస్ఎస్ తన లక్ష్యాన్ని సాధిస్తుందని, 100 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, నిషేధాలను ఎదుర్కొని ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థగా నిలబడిందని, అందుకు కారణం కేవలం త్యాగమయ జీవితాన్ని అనుభవిస్తున్న కోట్లాదిమంది స్వయం సేవకులేనని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల నిర్మాణంలో శిక్షావర్గల పాత్ర ఎంతో అమూల్యమైనదని వారం రోజుల పాటు ఒక తపస్సు లాగా ఎంతో కఠినమైన శిక్షణను పొందిన కార్యకర్తలు తమ గ్రామ గ్రామంలో సంఘ శాఖలు ప్రారంభించి కార్య విస్తరణ కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు. శతాబ్ది సంవత్సరం పూర్తయ్యే నాటికి ఇందూరులో విభాగ్ లో శాఖ లేని గ్రామం ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఈ శిక్షావర్గలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ తమ తమ గ్రామాలలో శాఖలు ప్రారంభించి సంఘ కార్యాన్ని విస్తరింపజేయాలని సూచించారు. స్వయం సేవకుల జీవితం సమాజంలోని ఇతర ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, దేశభక్తి సామాజిక సేవ, సామాజిక బాధ్యత వంటి అంశాలను మనం నిత్యజీవితంలో ఆచరణలో చూపించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్గ కార్యవాహ దాత్రిక పాండురంగారావు, వర్గ ప్రబంధక్ ప్రముఖ్ సుమిత్ కుమార్, భార్గవ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
