- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
బోధన్, బతుకమ్మ : యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలని అన్నారు. మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోందన్నారు. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే, జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. యువత దేశ భవిష్యత్తు, మీరు ఆరోగ్యంగా ఉంటూ, మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో వ్యాసరచన పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు, బోధన్ ఎస్ హెచ్ ఓవెంకట్ నారాయణ, రుద్రూర్ సి.ఐ కృష్ణ, ఎడపల్లి ఎస్.ఐ రమా, బోధన్ రూరల్ ఎస్.ఐ. మచ్చేందేర్ రెడ్డి, రెంజల్ ఎస్.ఐ చంద్ర మోహన్, కోటగిరి ఎస్ఐ సునీల్, 26 జట్ల క్రీడాకారులు, యువత, బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

