. . . ధర్నాచౌక్ లో బ్యాంకు ఉద్యోగుల భారీ సమ్మె
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు గత 11 సంవత్సరాలనుండి ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బియూ) ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో భారీ ధర్నా ని4ర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాదు యూనిట్ కన్వీనర్ రమేష్, గురునాథ్ లు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు,ఆర్ బిఐ, ఎన్ఏబీఏఆర్ డీ, ఎస్ ఈబీఐ, ఎల్ఐసి వంటి సంస్థలకు ఇప్పటికే 5 రోజుల పని విధానం అమలులో ఉందని,బ్యాంకులకి కూడా ఇప్పటికే సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. “బ్యాంకు ఉద్యోగులు పని వేళలు ముగిసిన తర్వాత కూడా పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. సెలవు రోజుల్లో సైతం విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాంకేతికత పెరిగినా పని భారం మాత్రం తగ్గలేదు. ఉద్యోగుల పని–జీవిత సమతుల్యత కోసం 5 రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని నాయకులన్నారు. బ్యాంకుల లాభాల్లో ఉద్యోగుల కృషి కీలకమని పేర్కొంటూ న్యాయమైన పీఎల్ఐని అందరికీ సమానంగా, పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఎన్ పీఎస్ స్థానంలో ఎపీఎస్ పునరుద్ధరణ, పెన్షన్ సమస్యల పరిష్కారం, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బీమా భారాన్ని తగ్గించడం తదితర సమస్యలను కూడా పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. “5 రోజుల పని దినాలు,తగినంత సిబ్బంది, గ్రాట్యుటీ పెంపు, ఎన్ పీఎస్ లో అదనంగా జమ చేసే 4% చందాపై ఆదాయపు పన్ను మినహాయింపు, పెన్షన్ అప్డేషన్ వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, ఐబీఏ సానుకూలంగా పరిగణించి వెంటనే పరిష్కరించాలి, లేనియెడల ఇదివరకే ప్రకటించిన విధంగా నెల చివరన జరిగే మూడు రోజుల సమ్మెకు అక్టోబర్ లో నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబొమని హెచ్చరించారు. సమ్మెను విజయవంతం చేసిన బ్యాంకు ఉద్యోగులకు , అధికారులకు , ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన ఇతర ట్రేడ్ యూనియన్లకు యూఎఫ్ బీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెలో నిజామాబాద్ జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 1000 మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారన్నారు. ఈ సమ్మెలో యూఎఫ్ బీయూ నాయకులు రాజు, మనోజ్ సింగ్ , వంశీ, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
