. . . నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బడ్జెట్, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా 6 గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2,000 పెన్షన్ను రూ.4,000 చేస్తామని, ఇంట్లో ఇద్దరికి ఇస్తామని ఆశ చూపి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలతో రైతులను,పేద ప్రజలను ఆదుకున్న ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ విఫల పాలనపై శాంతియుతంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 420 హామీల ఫ్లెక్సీల ప్రదర్శన, ధర్నాలు, బైక్ ర్యాలీలు, నిరసనలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీష్ రెడ్డి,మాజీ మంత్రి ఎమ్మెల్యే సుజాత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు, ప్రభుత్వం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలను గమనిస్తున్న ప్రజలు ఇతర పార్టీల నాయకులు బిఆర్ఎస్ వైపు వస్తున్నారని, ప్రతినిత్యం భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.
