నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో 12వ డివిజన్ ధర్మపురి హిల్స్ యువ నాయకుడు ఎస్.కె.అమీర్ జలాల్ తన మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ సాధారణంగా ఏదైనా లాభం పొందాలనుకునే వారు అధికార పార్టీలో చేరుతారని కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండటం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో మళ్లీ ఆదరణ పెరుగుతోందని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బిగాల అన్నారు. ప్రతి డివిజన్లో బీఆర్ఎస్లో జరుగుతున్న భారీ చేరికలు దీనికి నిదర్శనమని , రానున్న రోజుల్లో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి మరింత ఆదరణ పెరిగి, తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని గణేష్ బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నవీద్ ఇక్బాల్, సమీ, సనా ఉల్లా, సిర్ప రాజు, సుజిత్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
