. . . కొన్ని వార్డుల్లో చుక్కనీరు కరువు
. . .మరికొన్ని చోట్ల అరకొర సరఫరా
. . .రంగుమారిన నీరు వస్తుండటంతో స్థానికుల ఆగ్రహం
. . .ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ శాఖల మధ్య సమన్వయ లోపంపై విమర్శలు
జుక్కల్, బతుకమ్మ :
పండుగ రోజుల్లోనైనా కనీసం సురక్షితమైన తాగు నీటి ని సరఫరా లేక ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పేరుకే నియోజకవర్గం కేంద్రమైన జుక్కల్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా కూడా నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని కొన్ని వార్డుల్లో అసలు నీటి సరఫరా జరగకపోగా.. మరికొన్ని వార్డుల్లో అరకొరగా నీరు వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రంగుమారిన నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్), మిషన్ భగీరథ (గ్రిడ్) శాఖల మధ్య సమన్వయం కొరవడటంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా.. గ్రిడ్ శాఖలో ఏఈ, డీఈఈ ఉన్నప్పటికీ వారు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
దీంతో మంచినీటి సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో మంచినీటి సరఫరా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన మండల సమీక్ష సమావేశంలోనూ మంచినీటి సరఫరా సమస్యను ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు.
