- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్, బతుకమ్మ : హిందువులను విడదీద్దామని, ముస్లింలకు గులాంగిరి చేద్దామని ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ కులం గురించి వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. 1994లో గుజరాత్ రాష్ట్రంలో మోడీ కులాన్ని బీసీలలో చేర్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, 1999లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఈ విషయం తెలియక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదని అరవింద్ పేర్కొన్నారు. మోడీ కులాన్ని బీసీలలో చేర్చినప్పుడు ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాల చర్చ జరుగుతూనే ఉందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన కులగణన ఒక నాన్సెన్స్ గా అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక కోటి మైనర్లు మిస్సింగ్ అయ్యారని తాను నిరూపించానని గుర్తు చేశారు. కుల రాజకీయాలను మత రాజకీయాలను చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు వారి ట్రాప్ లో పడరని అన్నారు. అందరూ కలిసి ఉండాలని అప్పుడే కనబడి, నిలబడ గలుగుతామని భరతమాతను గెలిపించుకుందామని ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు.