. . . విద్యార్థి సంఘాల సచివాలయ ముట్టడి
. . . పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్
హైదరాబాద్, బతుకమ్మ :
విద్యారంగ సమస్యల పరిష్కారం, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన “చలో సచివాలయం” కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థి నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ విడుదల చేసిన ప్రకటనలో, చలో సచివాలయం పిలుపు నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే వందలాది మంది విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అలాగే మంగళవారం సచివాలయం వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి గోషామహల్, బేగంబజార్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లకు తరలించారని ఆరోపించారు.

అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాల కోసం వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తగిన నిధులు విడుదల చేయడంలో విఫలమైందన్నారు. పెండింగ్లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం ముట్టడి సందర్భంగా అరెస్టు అయిన పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, శ్రీకాంత్, మంద నవీన్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, అజయ్, రాష్ట్ర కోశాధికారి రాణా ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు మహేష్, ఉదయ్, గౌతం, సింహాద్రి, మహేష్తో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

