- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ నేరాలు నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ లో సైబర్ వారియర్స్ కి సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ వారియర్స్ ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి పోలీస్ సిబ్బంది ఈ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం అన్నారు. ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు వంటి నూతన పద్ధతులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేసును సీరియస్గా తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం కల్పించాలని సూచించారు. సైబర్ సెల్ను బలోపేతం చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాలపై నిపుణులుగా ఏర్పడాలని అన్నారు. ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 1930, https://www.cybercrime.gov.in నెంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై సమగ్ర అవగాహనతోనే సమర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చని, అందుకే పోలీస్ సిబ్బంది నిరంతరం నూతనమైన జ్ఞానం నేర్చుకోవాలి అని అన్నారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సైబర్ వారియర్స్ అందరికీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ వారి ” టీ షర్ట్స్ ” అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైబర్ క్రైమ్ పిఎస్ వై.వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మహమ్మద్ ముఖిద్ పాషా ఎం ప్రవళిక సబ్ ఇన్స్పెక్టర్ , శ్రీనివాస్ , శ్రీరామ్ , సురేష్ , నాగభూషణం , నరేష్ , ప్రవీణ్ , రాఘవేంద్ర, సుమలత , శృతి , రమ్య , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

