ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని మేఘ్య నాయక్ తండా గ్రామానికి చెందిన బీఎల్వో వినోద్ను ఎస్ఐఆర్ ప్రక్రియలో విశేష ప్రతిభ కనబరిచినందుకు తహసీల్దార్ బాలయ్య ఘనంగా సన్మానించారు. మండలంలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మేఘ్య నాయక్ తండా గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ – 158 పరిధిలో మొత్తం 1,071 ఎస్ఐఆర్ ఫారాలు నమోదు చేయాల్సి ఉంది. వాటిలో 1,051 ఎన్యూమరేషన్ ఫారాలను విజయవంతంగా డిజిటలైజ్ చేసి ఎస్ఐఆర్ యాప్లో అప్లోడ్ చేసినట్లు తహసీల్దార్ బాలయ్య తెలిపారు. అలాగే, పరిశీలనలో 15 మంది మరణించిన ఓటర్లు, 25 డబుల్ ఓటర్లను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బీఎల్వో వినోద్ను పూలమాల, శాలువాతో సత్కరించి అభినందించారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో ఆయన చూపిన నిబద్ధత ఇతర బీఎల్వోలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. మండలంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో కూడా సంబంధిత బీఎల్వోలు ఎస్ఐఆర్ యాప్లో ఫారాల నమోదును, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ఇందల్వాయి మండలాన్ని జిల్లాలో ముందంజలో నిలపాలని తహసీల్దార్ బాలయ్య సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మేఘ్య నాయక్ తండా సర్పంచ్ కాట్రోజు బంతిలాల్, జీపీఓ రాజేశ్వర్, ఉపసర్పంచ్ సోముల నాయక్తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
