ధర్పల్లి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కర్రోళ్ల లాక్షిత (23) మృతి చెందగా, ఆమెను వరకట్న వేధింపుల కారణంగా హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం ప్రకారం, మోస్రా ప్రాంతానికి చెందిన లాక్షితకు నెహ్రూతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం నుంచి అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో లాక్షిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన అనంతరం భర్త నెహ్రూ, అత్తమామలు పరారీలో ఉన్నట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
