- ప్రజావాణిలో ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం
- రెవెన్యూ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశం
నిజామాబాద్, బతుకమ్మ : టైటిల్ (పట్టా పాస్ బుక్) లేనివారు ఫిర్యాదు చేస్తే పట్టాదారుకు సర్వే నోటీసులు ఇవ్వడం ఏంటి అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి (పాలన అధికారి) ఆశ్చర్యానికి గురైన ఘటన ప్రజావాణిలో చోటు చేసుకుంది. ఫిర్యాదుదారు ఎవరు అతనికి భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా సర్వేకు దరఖాస్తు చేయగానే పట్టదారుకే ల్యాండ్ సర్వే అధికారులు నోటీసులు ఇవ్వడంపై భూయజమాని జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం జరిగింది.
సర్వే నిర్వహించమని అర్జీలు పెట్టుకోకున్నా సంబంధిత పట్టాదారుకే నోటీస్ లు జారీ చేసి సర్వేకు హాజరు కావలని కోరడం రెవెన్యూ అధికారులకే చెల్లింది. తమ భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ భూములు (అసైండ్) భూమి కబ్జాకు గురవుతుంది పట్టించుకోవాలని చేసిన దరఖాస్తులు చెత్త బుట్టల పాలవ్వడం ల్యాండ్ సర్వే అధికారుల నైజం. వందల కొద్ది దరఖాస్తులు వాటిపై అప్పిళ్లు, ప్రజావాణిలో ఫిర్యాదులు కోకొల్లలు. కాని రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు తలుచుకుంటే ఏడాది వ్యవథిలోనే ఒక భూమికి సర్వే చేయడం దానికి క్లీన్ చీట్ ఇవ్వడం. మళ్లీ రీ సర్వే చేయడం చూడాలి అంటే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారులకే సొంతం.
వివరాల్లోకి వెళితే మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని సర్వే నెంబరు 602 లో సుమారు 400 ఎకరాల అసైండ్ భూమి ఉంది. అందులోని సబ్ డివిజన్ నెంబర్ ద్వారా అవధూత నిరమలానంద స్వామి కి 1984 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం 5.00 ఎకరాల సాగు భూమిని కేటాయించింది. దానిలో వ్యవసాయం చేస్తు సంబంధిత భూమిపై అధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు. 2019లో కరోనా మహమ్మారి కారణంగా భూమిలో వ్యవసాయం చేయలేక నర్సింగ్ పల్లి కి చెందిన వారికి కౌలుకు ఇచ్చారు. అయితే 2020 సంవత్సరంలో ఈ భూమిపై స్థానిక గ్రామ మాజీ ప్రజా ప్రతినిధితో పాటు మరి కొందరి కన్ను పడింది. తనకు ఉన్న పలుకుబడితో సదరు స్వామిని బెదిరింపులకు గురిచేసి ఆ భూమిని కబ్జా చేసి ఇకపై ఈ భూమి వైపు వస్తే నీకు మర్యాదగా ఉండదని ఎక్కువ చేస్తే ప్రాణాలు ఉండవని బెదిరించి ఆ భూమిని చెరబట్టారు. ప్రభుత్వం వారిదే కనుక ఏ అధికారిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. 2023 సంవత్సరంలో ప్రభుత్వం మారిన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చొరవ చూపడంతో, సదరు స్వామీజీ జిల్లా కలెక్టర్, ఎడి ల్యాండ్ సర్వే, నిజామాబాద్ అర్డిఓ, మోపాల్ తహసీల్థార్ ల చుట్టూ దాదాపు 2 సవత్సరాలు తిరిగిన తర్వాత సర్వే చేయడానికి అంగీకరించారు. 2025 మార్చి నెలలో ఎడి ల్యాండ్ సర్వే ఆదేశాలతో రెవెన్యు డివిజినల్ అధికారి నిజామాబాద్ కార్యాలయ డిప్యూటి ఇన్స్ పెక్టర్ ఆఫ్ సర్వే నిర్వహించి స్వామీ అవధూత నిర్మాలనంధకు భూమిని అప్పజెప్పడం జరిగింది. అందులో వారు వారి శిష్యులకు ధార్మిక విషయాలు బోదించుటకు, భజన కార్యక్రమాలు నిర్వహించుటకు అక్కడ కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది చూడలేని కబ్జాదారులు ఆ కుటీరాన్ని దహనం చేసి అక్కడ ఉండేవారిని భయబ్రాంతులకు గురిచేశారు. ఈ విషయమై మోపాల్ పోలీస్ స్టేషన్ లో కేసు కుడా నమోదు చేయబడింది.

మార్చి నెలలో 602 లో సర్వే చేసి అవధూత నిర్మలానంధ స్వామి కి భూమిని అప్పజెప్పిన రెవెన్యు అధికారులే ఎటువంటి భూమి పత్రాలు లేని కబ్జాదారు అర్జీ మేరకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు టైటిల్ లేకుండా సంబంధిత అనుబంధ డివిజన్ కు సంబంధించి పత్రాలు లేకుండా అవధూత నిర్మలానంద స్వామి భూమిని తిరిగి సర్వే నిర్వహించుటకు వారికే నోటీస్ జారీ చేయడం కలకలం రేపుతోంది. నాలుగు నెలల క్రితం రెవిన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు కబ్జా చెరనుంచి విడిపించామని పంచనామా ఇచ్చిన వారు రీసర్వే నోటీసులు ఇవ్వడం ఏమిటిని చర్చ జరగుతుంది. ఒకటి రెండు సార్లు సర్వే చేసిన వారు తిరిగి మళ్ళీ సర్వే నోటిస్ జారీ చేయడం వెనుక రెవెన్యు అధికారుల ఆలోచనేంటో అనేది అంతుచిక్కకుండా ఉంది. తాను ఎటువంటి అర్జీ పెట్టుకోకుండా తనభూమికి సర్వే ఏంటి అని, జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల లీలలు చూసి పాలన అధికారి విస్మయం చెందారు. భూమి పట్టాదారుకు నోటీసులు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్ రెవిన్యూ అధికారులను వివరణ కోరడంతో 602 సర్వే నెంబర్ లో జరుగుతున్న భూమి ఆక్రమణలు వెలుగు చూసే అవకాశం ఉంది.
