బతుకమ్మ, బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పంచాయతీ కార్యదర్శితో కలిసి రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద మంజూరైన ఇళ్లకు సంబంధించిన మార్కింగ్లు, బేస్ లెవెల్ నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన స్థితిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా, ఆయా లబ్ధిదారులను ప్రోత్సహించడంతో పాటు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శికి సూచనలు జారీ చేశారు. అలాగే, పథకం కింద మంజూరయ్యే నిధులు దశలవారీగా ఎలా విడుదల అవుతాయో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించి, అనుసరించవలసిన ప్రక్రియపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అర్హులైన కుటుంబాలందరూ ఈ పథకం ద్వారా లబ్ధిపొందేలా అధికారులు కృషి చేయాలనీ సబ్ కలెక్టర్ సూచించారు.
