బోధన్, బతుకమ్మ :
మాతృశ్రీ విద్యాసంస్థలు 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల కరస్పాండెంట్ సిరిగిరి జయశ్రీ దిగంబర్ రావు ఆధ్వర్యం వహించారు. ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, ఎంఈఓ నాగయ్య హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యాసంస్థల అధినేత దివంగత సిరిగిరి దిగంబర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బోధన్ పట్టణంలో విద్యా రంగానికి దిగంబర్ రావు చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నత స్థానాలకు చేరేలా మార్గనిర్దేశం చేశారని తెలిపారు. విద్యార్థులు ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. అనంతరం అతిథులను విద్యాసంస్థల తరఫున ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు సిరిగిరి శశాంక్, సిరిగిరి శృతి, మేనేజర్ హవప్పనూర్ సుభాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
