నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని రోడ్లపై కూరగాయలు, తోపుడు బండ్ల వ్యాపారం కారణంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లు వెళ్లలేని పరిస్థితి ఉందని, వీధి వ్యాపారులను వెంటనే రైతు బజార్లలోకి తరలించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ , ట్రాఫిక్ ఏసీపీ నారాయణతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫుట్ పాత్ ల ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తొలగించాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ, చెత్త తరలింపుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధికి నాయకులు, ప్రజలు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రంలో ట్రాఫిక్ సీఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
