నిజామాబాద్, బతుకమ్మ: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ.శరత్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని హితవు పలికారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లాలో మంచి నీటి సరఫరా పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి తలెత్త ప్రాంతాల్లో ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టే మెకానిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బోరు చెడిపోయిందన్న సమాచారం అందిన వెంటనే గంటల వ్యవధిలోపు మరమ్మతులు పూర్తి చేయించి దాహార్తి సమస్య ఏర్పడకుండా సత్వరమే పనులు జరిపించాలన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాలతో పాటు ఆయా మండలాలకు తాగునీటిని అందించే జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లో ఎంపిడిఓలు, ఎంపిఓలతో కూడిన క్లస్టర్ బృందాలు నిరంతరం నీటి సరఫరాను పర్యవేక్షించేలా చూస్తామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
