ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నియమించిన స్టేట్ అబ్జర్వర్లు బి. రమేష్, అబ్దుల్ నబీ ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ విధానం, హాల్ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్ర సిబ్బందికి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పరిశీలకులకు పరీక్షల నిర్వహణ వివరాలను తెలియజేశారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
