. . . ఐదుగురు నేరస్తుల రిమాండ్
నందిపేట్, బతుకమ్మ :
మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన నయీమ్ హత్యాయత్నం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై కే. వినయ్ తెలిపారు. రాజ్నగర్కు చెందిన షేక్ నయీమ్(30)పై పాత కక్షల నేపథ్యంలో ఆదివారం క్యారంబోర్డ్ షాప్ వద్ద కత్తులు, ఇనుపరాడ్లతో దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నయీమ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెల్మల్ క్రాస్రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో షేక్ తాహెర్, షేక్ తాలిబ్, షేక్ గాలిబ్ అలియాస్ హమీద్ (నందిపేట్), సయ్యద్ అబ్దుల్ హలీం, ఎస్కే ఫజల్ (కామారెడ్డి) ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు ఇనుపరాడ్లు, ఒక కత్తి, రెండు మోటార్సైకిళ్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
