. . . క్రీడాకారులకు అండగా ఉంటా
. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పై దృష్టి సారించాలని, క్రీడల వల్ల మానసిక స్థైర్యం, శారీరక దారుడ్యం కలుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలోజరుగుతున్న ’69వ ఎస్జీఎఫ్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ అండర్-17 (బాలబాలికల) టోర్నమెంట్, ఎంపికల పోటీల’ కార్యక్రమానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్యేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల నిర్వహణలో పీఈటీలు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవను, వారి అంకితభావాన్ని ఆయన కొనియాడారు. క్రీడాకారులకు, అసోసియేషన్ సభ్యులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, క్రీడల నిర్వహణలో ఎవరూ వెనకడుగు వేయవద్దని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి, వేల్పూర్ వేదికగా రాష్ట్ర స్థాయి ఈవెంట్ను నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎక్కడ వీలైతే అక్కడ పెద్ద ఎత్తున టోర్నమెంట్లు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేని విధంగా మన బాల్కొండ నియోజకవర్గంలో రెండు ఇండోర్ స్టేడియంలు (కమ్మర్పల్లి, వేల్పూర్) లో ఉన్నాయని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయ, సహకారంతో ఈ మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తన తండ్రి, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గొప్ప క్రీడాకారుడని గుర్తు చేసుకున్నారు. ఆయన జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడని, సీనియర్ నేషనల్స్ ఆడారని, అలాగే క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ వంటి అన్ని క్రీడలలో రాణించారని తెలిపారు. విద్యాసాగర్ సూచించినట్లుగా భవిష్యత్తులో సురేందర్ రెడ్డి పేరు మీద రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడానికి అసోసియేషన్ అధికారులు చొరవ తీసుకుంటే, దానికి తన పూర్తీ సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే ఒక గొప్ప విజయమని, ప్రతి జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉండగా, కేవలం 16 మంది మాత్రమే జిల్లా జట్టుకు ఎంపికవుతారని, అటువంటి ప్రతిభావంతులు ఇక్కడికి రావడం అభినందనీయమని అన్నారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా స్వీకరించాలని సూచించారు. నిజ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుకు 60 శాతం, క్రీడలకు 40 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా క్రీడల వల్లే వస్తుందన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు మంచి భోజన వసతి కల్పించాలని నిర్వాహకులకు ఆదేశించారు. మండలం, గ్రామ పార్టీ పక్షాన టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఇక్కడ ఉన్న సౌకర్యాలతో సర్దుకుపోయే తత్వాన్ని అలవర్చుకుంటారని అన్నారు. త్వరలో జరగబోయే వాలీబాల్ టోర్నమెంట్కు కూడా తమ వంతు సహాయం అందిస్తామని, పిల్లల భవిష్యత్తు కోసం క్రీడలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, క్రీడా సంఘం బాధ్యులు సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శోభన్, నాగమణి ఎస్ జీ ఎఫ్ సెక్రటరీ నిజామాబాద్, ప్రభాకర్ రెడ్డి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పీఈటీలు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, నీరజ రెడ్డి, అంద్రయ్య ఎంఈఓ, సాయన్న, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ, రాష్ట్ర స్థాయి పరిశీలకులు, సెలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


