పుష్కర సాన్నమాచరించిన మంత్రి శ్రీధర్ బాబు
సాయంత్రం గోదావరి హరతిని ప్రారంభించనున్న సీఎం
కాళేశ్వరం, బతుకమ్మ : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలను మాధవనంద సరస్వతి స్వామి ప్రారంభించారు. పుష్కరణి వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం నుంచి ఈనెల 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాల నిర్వహణకు రాష్ర్ట ప్రభుత్వం రూ. 35 కోట్లు కేటాయించింది.
సరస్వతి దేవి విగ్రహాన్నిఆవిష్కరించనున్న సీఎం
గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకుంటారు. పుష్కర సాన్నమాచరించి శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు అనంతరం సరస్వతి నదికి ఇచ్చే హరతిలో పాల్గొంటారు. 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భక్తులకోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం రేవంత్ కావడం విశేషం.


