- రాత్రి వేళల్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా
- వే బిల్లులు ఒక వైపు.. డంపింగ్ మరో వైపు
రుద్రూర్, బతుకమ్మ : ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పర్మిషన్ ముసుగులో కొందరు అక్రమార్కులు రాత్రి వేళల్లో ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. కొన్ని ట్రాక్టర్ లకు ఇసుక అనుమతులు ఉంటే మరికొన్ని ఇసుక ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పొతంగల్ పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో జోరుగా రవాణా చేస్తున్నారు. వేబిలులు ఒకవైపు తీసుకొని మరోవైపు డంపింగ్ లు చేస్తున్నారు. రుద్రూర్ గ్రామం మీదుగా బొప్పాపూర్, వర్ని ఇతర గ్రామాలకు ఇసుకను తరలిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇసుక కొన్ని ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ కూడా లేవని, అసలు ఏ ట్రాక్టర్ ఎటు వెళ్తుందో ఎక్కడ ఇసుకను అమ్ముకుంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

