. . . గ్రామస్తులతో ఆప్యాయ పలకరింపు
. . . పలు సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
. . . ఇందిరమ్మ ఇండ్లు,తదితర పనుల స్థితిగతుల పై ఆరా
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శనివారం తన స్వగ్రామం రూరల్ మండల పరిధిలోని జలాల్పూర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి స్థానిక గ్రామ సర్పంచ్ చెన్నూరు నవనీత-వెంకట్ రెడ్డి ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతి అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులను మెచ్చిన పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గనిశెట్టి రాజు కుమారుడి వివాహం రెండు రోజుల క్రితం జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే బంధువు రేకులపల్లి రాజు బాయి వయోభారంతో ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజు బాయి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీచైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, నాయకులు భాగారెడ్డి, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
