- ప్రభుత్వేతర సంస్థల బాగోతాలు ఒక్కొక్కటి బట్ట బయలు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తనిఖీలలో ప్రభుత్వేతర సంస్థల బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. మొన్న స్వధార్ హోమ్, నేడు గాడ్స్ పేరేదైన పనులు ఒక్కతీరుగానే ఉన్నాయ్. ఆర్థిక వనరులు పొందేది కేద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వసతుల కల్పన అంతంతే.. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ బ్యాంక్ కాలోని లో గల గాడ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మూగ, చెవిటి పిల్లల స్కూల్ ను నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. 58 విద్యార్థులకు గాను 28 విద్యార్థులే ఉన్నారు. విద్యార్థులను బ్లాక్ బోర్డు పై తెలుగులో అక్షరాలు రాయమంటే సరిగా రాయక పోవడం గమనించారు. విద్య బోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందుబాటులో కనిపించక పోవడం గమనించారు. గాడ్స్ హెడ్ శోభ ను పరిస్థితులు ఇలా ఉంటే ఎలా అంటూ అరా తీశారు. నాల్గవ తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతులు ఉన్న మౌలిక వసతులు లేకపోతే ఎట్లా అంటూ ప్రశ్నించారు. సరైన విద్యాబోధన కల్పించక పోవటమేమని వాకాబు చేశారు. మూగ, చెవిటి బాలల భవిష్యత్ విద్యతో ముడిపడి ఉన్నందున విద్యాబోధనలో నిర్లక్ష్యం తగదని గాడ్స్ నిర్వాహకులకు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి ఈ విషయం న్యాయసేవ సంస్థ తెలియజెస్తుందని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు.
