నిజామాబాద్, బతుకమ్మ : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు సహ మరొకరు దుర్మరణం చెందారు. ఈఘటన మహారాష్ట్రలోని బోకర్ తాలుకాలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాలాజ్ గణేశ్ దర్శనానికి జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ నుంచి 15 మంది మూడు కార్లలో వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని సాయంత్రం 4 గంటలకు తిరుగపయనమయ్యారు. మూడు గంటల ప్రయాణం తర్వాత మహారాష్ట్రలోని బోకర్ తాలుకా నందా గ్రామం వద్ద ఓ కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న దంపతులు చేకూరి బుల్లిరాజు(53), సునీత(48), బుల్లిరాజు బావమరిది భార్య వాణి (45) తీవ్రగాయాలతో మృతి చెందారు. వాహనం నడుపుతున్న గుణంశేఖర్ కు తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కారు లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు నీలిమను భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్థానిక పోలీసులు బోకర్ ఆస్పత్రికి తరలించారు.

