బియ్యం నిల్వలను వేగంగా తరలించాలి

0 14,654
  • జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గల మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు. ఎన్ని రైస్ మిల్లుల నుండి ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిగిన బియ్యం నిల్వలు గోడౌన్లకు చేరాయి, ఇంకా ఎన్ని నిల్వలు రావాల్సి ఉంది, వాటి నాణ్యత పరిశీలన, లాటింగ్ ప్రక్రియలను ఎలా నిర్వహిస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, బియ్యం, ధాన్యం నిల్వలను గిడ్డంగులకు వేగవంతంగా తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాలలో బియ్యం, ధాన్యం బస్తాలు తడిసిపోకుండా యుద్ధప్రాతిపదికన వాటిని గోడౌన్లకు తరలించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్లలో లీకేజీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోడింగ్, ఆన్లోడింగ్ ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా సరిపడా సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఆయా గిడ్డంగులలో అందుబాటులో ఉన్న స్థలం పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలని, బియ్యం, ధాన్యం బస్తాల తరలింపు సమయంలో వర్షాల వల్ల తడిసిపోకుండా టార్పాలిన్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కాగా, గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వలను ఆన్లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ అలసత్వ వైఖరిని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టరుపై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు సిఫార్సు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెక్రెటరీ అపర్ణ, గోడౌన్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

Rice stocks should be moved quickly.

Leave A Reply

Your email address will not be published.