రైస్ మిల్లర్లే దళారులు

0 2,399

. సొసైటీ అధికారులతో కుమ్మక్కు

. రైతులకు సమాచారం ఇవ్వకుండానే కడ్తా

బాన్సువాడ, బతుకమ్మ: సొసైటీ అధికారులతో కుమ్మక్కైన రైస్ మిల్లర్లు దళారుల అవతారం ఎత్తారు. చెన్ను పట్టని ధాన్యమే కాకుండా చెన్ను పట్టిన ధాన్యంలో నుంచి కూడా ఒక బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. మహ్మద్ నగర్ మండలం గున్కుల్ సొసైటీ పరిధిలో నర్వ, మహమ్మద్ నగర్, గున్కుల్, బూర్గుల్, తుంకిపల్లి, సింగీతం మొత్తం 9 కొనుగోలు కేంద్రాలు ఉండగా, మిగతా గ్రామాల రైతుల కోసం ఐకేపీ ఆధ్వర్యంలో ఆరు కేంద్రాలు కొనసాగుతున్నాయి.

అంతా సాఫీగానే సాగుతున్న క్రమంలో సొసైటీ అధికారులతో కుమ్మక్కై రైస్ మిల్లర్లు దళారులగా అవతారం ఎత్తారు. వెయిట్ లాస్ పేరుతో అదనంగా ఒక్క లారీకి 10 నుంచి 16 ధాన్యం బస్తాలను కోత విధిస్తున్నారు. రైస్ మిల్లులో ఉండాల్సిన ధర్మ కాంటా రైతులకు కనబడదు. ఎందుకంటే బయట ఉండాల్సిన డిస్ప్లే తొలగించి వారి సిస్టంకు కనెక్ట్ చేయడంతో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ధాన్యం బస్తాలను తరుగు పేరిట దోచుకుంటున్నారు.

ఇదేమిటని రైతులు రైస్ మిల్లర్ల యజమానులను ప్రశ్నిస్తే ‘మీ సొసైటీలో మాట్లాడుకోండి’ అంటూ కరాకండిగా సమాధానం ఇస్తున్నారు. దీనిపై సొసైటీ సీఈవోను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని చేతులెత్తేయడం గమనార్హం. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రైతులను రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు తమను నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. కనీసం ప్రజాప్రతినిధులైన కలుగజేసుకొని దళారులు తమను దోచుకోకుండా చూడాలని వేడుకుంటున్నారు. మరోవైపు అకాల వర్షాలు కుస్తుండడంతో ధాన్యం తడుస్తోందని ఆందోళన చెందుతున్నారు.

Rice millers are brokers.

Leave A Reply

Your email address will not be published.