- స్పందించిన ఇరిగేషన్ అధికారులు
- ‘బతుకమ్మ’ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
బతుకమ్మ, కోటగిరి : పోతంగల్ మండలంలోని జల్లపల్లి శివారులో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను 1997లో టిడీపీ హయాంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఆ భూములకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన పంట కాలువను ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన రైతు పూడ్చివేశాడు. పంటకాలువ పూడ్చివేతపై ‘బతుకమ్మ’ దినపత్రికలో మంగళవారం ‘పంటకాలువ పూడ్చివేత’ అనే శీర్షకన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మంగళవారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులు క్రింది రైతులకు నీళ్లు అందకుండా పంట కాలువను పూడ్చి వేసిన ఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో కాలువ పునరుద్ధరణ పనులు చేపట్టారు. దిగువన ఉన్న సుమారు రెండు వందల ఎకరాలకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ‘బతుకమ్మ’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.