నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
వేసవి సెలవులు వస్తున్నాయని, వలస బ్రతుకులు సాగదీస్తున్న ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ప్రజలు తమ స్వగ్రామాలకు వచ్చి వెళుతారని, కావున అజంతా ఎక్స్ప్రెస్ (17063/4)ను మన్మాడ్ నుంచి ముంబైకి పొడిగించాలని ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్) సభ్యులు కోరారు. ఈ విషయమై శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ (అసిస్టెంట్) ని ముంబైకర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. రైళ్లను పొడగించడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, నిజామాబాద్ మీదుగా ముంబైకి కేవలం దేవగిరి రైలు ఒక్కటే ఉండడం మూలాన తమ వలసజీవులకు టిక్కెట్లు దొరకక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఆ రైలు మన్మాడ్ స్టేషన్లో దాదాపు 12 గంటల పాటు వృధాగా ఉంచడం కన్న ముంబై వరకు పొడిగించడంతో సౌకర్యం కలుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. మరోవైపు ముంబై సిటీ నుంచి బయలుదేరే రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ (17611), తపోవన్ (17618), వందే భారత్ (20705) ఈ 3 రైళ్లు నాందేడ్ వరకు వస్తున్నాయని, వాటిని నిజామాబాద్ వరకు పొడిగించాలని ఆ నివేదికలో లిఖించారు. ఐతే ఈ విజ్ఞప్తిని మీరు రాష్ట్ర, కేంద్ర రైల్వే మంత్రులు, సంబంధిత అధికారుల వరకు తెలియజేయాలని ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్) కన్వీనర్లు తాటికొండ మురళీధర్ పద్మశాలి, మూలనివాసి మాలజీ, ఆర్.దుర్గాప్రసాద్, అరుణ్ కుమార్ పద్మశాలి, మమత మాలజీ కోరారు.

